బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : సిపిఐ
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: గుదిమళ్ల వద్ద యేటిలో పడి మృతి చెందిన పిల్లల కుటుంబాలను ఆదుకోవాలని సిపిఐ విజ్ఞప్తి చేసింది. గురువారం ఈతకు వెళ్లి మృతి చెందిన లోకేష్, హరీష్, గణేష్ మృతదేహాలను సిపిఐ నాయకులు బాగం హేమంతరావు, పోటు ప్రసాద్, ఎస్ కె జానిమియా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి మృతుల కుటుంబాలను ఓదార్చారు. లోకేష్, హరీష్ ల తల్లిదండ్రులు ఆముదాల చిరంజీవి, లక్ష్మి సిపిఐ నేతలను చూసి బోరున విలపించారు. చిరంజీవి ఆటో డ్రైవర్గా ఏఐటియుసిలో చురుకైన కార్యకర్తగా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా హేమంతరావు మాట్లాడుతూ చిరంజీవి కుటుంబం రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబమని అలాగే గణేష్ తల్లి బానోత్ కళావతి భర్త మృతి చెందిన కాయ కష్టం చేస్తూ కుమారున్ని చదివించుకుంటుందని అతనిపై ఆశలు పెంచుకుందని ఈ రెండు కుటుంబాలను ప్రభుత్వం అదుకోవాలన్నారు. ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వ పరంగా కుటుంబాన్ని ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలు, బంధువుల రోదనలతో ఆసుపత్రి మారుమ్రోగింది.
Comment List