వైరా, కొణిజర్ల లో కాంగ్రెస్ రోడ్ షో కోలాహలం
విశేషంగా తరలొచ్చిన సమీప గ్రామాల పార్టీ శ్రేణులు - పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి, రెవెన్యూ మంత్రి పొంగులేటి
ఐ ఎన్ బి టైమ్స్ వైరా,కొణిజర్ల ఏప్రిల్ 30: కాంగ్రెస్ ప్రచార పర్వంతో కొణిజర్ల, వైరా మండల కేంద్రాల్లో మంగళవారం రాత్రి సందడి నెలకొంది. కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి భారీ విజయాన్ని కాంక్షిస్తూ..వందలాది మందితో కొణిజర్ల నుంచి ప్రదర్శన ఆరంభమైంది. కొణిజర్ల, వైరాల్లోని ప్రధాన సెంటర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రసంగించారు. మతతత్వ బీజేపీని నమ్మొద్దని, మాయమాటలతో పబ్బం గడిపే బీ ఆర్ ఎస్ లకు ప్రజలు గుణపాఠం నేర్పాలని కోరారు. బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల కష్టాలు పట్టించుకోకుండా.. విపక్షoలో కూర్చున్నాక..కేసీఆర్ కు అన్నదాతలు గుర్తుకు వస్తున్నారు అని చెప్పారు. రఘురాం రెడ్డి అందరికీ..లబ్ధి కలిగేలా చూసుకుంటారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఆయనకు భారీ విజయాన్ని అందించాలని కోరారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వమే ఏర్పడుతుందని, మతతత్వ బీజేపీకి ఓటమి తప్పదని అన్నారు.ఇప్పటికే సర్వేలన్నీ..కాంగ్రెస్ వైపే ఉన్నాయని స్పష్టం చేశారు.అంబులెన్సులకు దారి చూపించిన మంత్రులు : కొణిజర్ల రోడ్ షోలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు ప్రసంగిస్తున్న సమయాల్లో..రెండు అంబులెన్స్ లు ట్రాఫిక్ లో చిక్కుకున్న దృశ్యాలను వారు గమనించారు. వెంటనే.. మైకులో వాటికి దారి ఇవ్వాల్సిందిగా ప్రకటించి శ్రేణులను దగ్గరించి మరీ పంపించి వేశారు.ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీ నారాయణ, పోట్ల నాగేశ్వర రావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువాళ్ల దుర్గా ప్రసాద్, మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, సీనియర్ నాయకులు రాయల నాగేశ్వరరావు, మద్ధీనేని స్వర్ణ కుమారి, బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comment List