డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, ఫిబ్రవరి 8
జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) బయోటెక్నాలజీ విభాగానికి చెందిన కోనా వెంకట శ్రీ కృష్ణ ఇటీవల తన పీహెచ్డీ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి శాస్త్రీయ వర్గాల్లో ప్రశంసలు అందుకున్నారు. జేఎన్టీయూహెచ్లో నిర్వహించిన 14వ స్నాతకోత్సవం కార్యక్రమంలో V.C ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి గారి హస్తాల మీదుగా ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేయబడింది. డాక్టర్ సైదా నాయక్ మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ పరిశోధన మధుమేహం స్థూలకాయం వంటి జీవనశైలి వ్యాధుల చికిత్సలో ఉపయోగించే గ్లూకాగాన్–లైక్ పిప్టైడ్-1 (GLP-1) కోసం పరిశ్రమ ఎదుర్కొంటున్న తక్కువ ఉత్పత్తి సామర్థ్యం, స్థిరత్వ లోపం వంటి ప్రధాన సమస్యలకు పరిష్కార మార్గాలను అధ్యయనం చేసింది. GLP-1 ఆధారిత చికిత్సలు రక్తంలో చక్కెర స్థాయిని సహజంగా నియంత్రించడంతో పాటు ఆకలిని తగ్గించి బరువు నియంత్రణకు సహకరిస్తాయి; ఇవి మెట్ఫార్మిన్లా కేవలం గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా, ఇన్సులిన్లా బాహ్యంగా హార్మోన్ అందించకుండా శరీరంలోనే ఇన్సులిన్ స్రావాన్ని ఉత్తేజితం చేయడం ద్వారా భిన్నంగా పనిచేస్తాయి. ఈ పరిశ్రమాత్మక సవాళ్లను అధిగమించేందుకు కంప్యూటేషనల్ ప్రయోగాత్మక విధానాలను సమన్వయం చేస్తూ ఒక సమగ్ర, పరిశ్రమకు అనుకూలమైన ఉత్పత్తి వ్యూహాన్ని ఈ పరిశోధన ప్రతిపాదించింది. మీడియా ఆప్టిమైజేషన్ ఉత్పత్తి స్థిరత్వాన్ని పెంచే విధానాల ద్వారా పునరావృతయోగ్యమైన మార్గాన్ని సూచించడం ఈ అధ్యయనం ప్రత్యేకత. భారతదేశంలో ఉన్నత స్థాయి బయోటెక్నాలజీ పరిశోధన సామర్థ్యాన్ని ప్రతిబింబించే ఈ కృషి భవిష్యత్తు ఔషధ పరిశోధనలకు దిశానిర్దేశం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.




Comment List